ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ, పీజీ విద్యార్థులకు,,,,ఇకపై అది తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 06:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బోధనా రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోధన రుసుముల చెల్లింపు కోసం విద్యార్థి హాజరు శాతం కచ్చితంగా 75 శాతం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులు కాలేజీలకు రాకపోయినా కూడా 75 శాతం అటెండెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోధన రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీ, పీజీ విద్యార్థులకు సైతం ఐరిస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.


ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఐరిస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల కోసం గతంలోనూ ఈ విధానం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ విద్యార్థులతో పాటుగా పీజీ స్టూడెంట్స్‌కు సైతం ఐరిస్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా ఎంత మంది విద్యార్థులు ప్రతి రోజూ తరగతులకు హాజరవుతున్నారనే విషయంపై స్పష్టత వస్తుందని భావిస్తోంది. ఇక ఇందుకోసం యాప్ తీసుకురానుంది. ఈ అప్లికేషన్ ఉపయోగించి విద్యార్థుల ముఖ కవళికల ఆధారంగా అటెండెన్స్ వేయనున్నారు. దీని ద్వారా విద్యార్థులపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


మరోవైపు విద్యార్థుల ఐరిస్ అటెండెన్స్‌ను జ్ఞాన భూమి పోర్డల్‌కు లింక్ చేయనున్నారు. దీంతో ఈ యాప్‌లో ఓ సారి విద్యార్థుల వివరాలను నమోదు చేస్తే.. మూడేళ్ల పాటు ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు క్లాస్ రూమ్‌లోకి రాగానే.. యాప్ ఓపెన్ చేసి.. స్టూడెంట్ ముఖం ముందు ఉంచితే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత వాటిని ఓకే చేస్తే అటెండెన్స్ నమోదవుతుంది. అయితే ఒకేసారి ఒక్కరు కాకుండా.. ముగ్గురు, నలుగురు విద్యార్థుల అటెండెన్స్ తీసుకునేలా ఈ యాప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ విధానం అమలు చేయడం ద్వారా బోధన రుసుముల చెల్లింపుల్లో అక్రమాలు జరగవని.. తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్రాపౌట్స్ తగ్గుతుందని.. విద్యార్థుల మీద పర్యవేక్షణ పెరుగుతుందని ఆలోచన చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com