ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట... డిక్లరేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 06:10 PM

సుప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ హిందువులకు పరమపవిత్రమైన సన్నిధి. ఇప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారం కారణంగా ఏడుకొండలవాడి పేరు నిత్యం మీడియాలో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆయన తిరుమల పర్యటనకు వెళతాననగానే, డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన ప్రకటనలు చేశారు. అంతేకాదు, డిక్లరేషన్ ఇవ్వాలంటూ... ఒక్క వైసీపీ తప్ప అన్ని వర్గాల నుంచి జగన్ పై ఒత్తిడి అధికమైంది. ఈ పరిస్థితుల్లో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. జగన్ కారణంగా ఇప్పుడందరి దృష్టి తిరుమల డిక్లరేషన్ పై పడింది. హిందువులే కాదు... ఏ మతస్తులైనా తిరుమల రావొచ్చు, శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే, హిందూయేతరులు తిరుమల ఆలయంలో ప్రవేశించేముందు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తమకు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టీటీడీ నియమావళి పుస్తకంలో ఓ ప్రత్యేకమైన అధ్యాయమే ఉంది. 18వ అధ్యాయం పూర్తిగా డిక్లరేషన్ అంశాల కోసం కేటాయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ప్రజా దేవాలయాలు. హిందువులు తమ హక్కు కొద్దీ ఈ ఆలయాలను సందర్శించవచ్చు. అదే సమయంలో ఇతర మతస్తులు కూడా ఈ ఆలయాల్లోకి రావొచ్చు... దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, టీటీడీ ఆలయాల్లోకి ప్రవేశించే ముందు అన్యమతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి" అని ఆ ఫారం మొదట్లోనే పేర్కొన్నారు.ఆ తర్వాత... అన్యమతస్తులు డిక్లరేషన్ ఫారంలో తమ పేరు, చిరునామా రాయాలి. ఏ ఆలయం అయితే ఆ ఆలయంలోని దేవుడి పేరు రాసి, ఆ దేవుడిపై తమకు నమ్మకం ఉందని, ఆ భగవంతుడి ఆరాధనను గౌరవిస్తామని అంగీకరిస్తూ సంతకం చేయాలి. ఈ ఫారంపై సాక్షులు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది.ఇక ఈ డిక్లరేషన్ ఫారంను ఆలయ పేష్కార్ (ప్రత్యేక అధికారి)కి, లేక ఆలయంలో విధుల్లో ఉన్న ఇన్చార్జి అధికారికి అందజేయాలి. ఆ అధికారి ఆమోద ముద్ర వేసిన అనంతరం.... అందరు భక్తుల్లాగానే, అన్యమతస్తులు కూడా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com