ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగ‌ళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానన్న మంత్రి లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 02:25 PM

యువగ‌ళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. యువగళం 100 కిమీ పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను మంత్రి లోకేశ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేనని పేర్కొన్నారు. గతేడాది జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి తాను ప్రారంభించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించింద‌ని తెలిపారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2,200 గ్రామాలను స్పృశిస్తూ 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మరెవరూ చేయని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 45 రోజుల పాటు 577 కి.మీ.ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర రికార్డు సృష్టించింది. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆరోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో ప్ర‌జ‌లంతా కళ్లారా చూశార‌ని తెలిపారు. త‌న‌ పాదయాత్రను అడ్డుకునేందుకు జీఓ నెం.1ను సైతం విడుదల చేసి, ఇదే బంగారుపాళ్యంలో త‌న‌ ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. కానీ, యువగళం అన్నది త‌న‌ ఒక్కడి గొంతు కాద‌ని, 5 కోట్లమంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైందంటూ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేద‌న్నారు. ఇక పాదయాత్ర సమయంలో ప్రతి 100 కి.మీ.లకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మైలురాయి వేసి, అధికారంలోకి వచ్చాక నెరవేర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నానని మంత్రి తెలిపారు. అందులో భాగంగా యువగళం పాదయాత్ర 8వ రోజు (3-2-2023)న బంగారుపాళ్యంలో 100 కి.మీ.లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక్కడ తొలి మైలురాయిని ఆవిష్కరించిన‌ట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో డ‌యాల‌సిస్ కేంద్రం అవ‌స‌రం ఉంద‌ని స్థానికులు చెప్ప‌డంతో ప్రభుత్వ ఆస్పత్రిలో డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటు చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాన‌ని తెలిపారు. అందుకే అన్న‌మాట ప్రకారం ఇప్పుడు ఇక్క‌డ ఈ సెంట‌ర్ ప్రారంభిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.బంగారుపాళ్యం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నార‌ని, త‌ర‌చూ డ‌యాల‌సిస్ కోసం దూర‌ప్రాంతాల‌కు వెళ్లడానికి డ‌బ్బు, స‌మ‌యం ఖ‌ర్చవుతున్నాయి. ప్రైవేట్ డయాలసిస్ సెంట‌ర్లకు వెళ్లి వేలు వెచ్చించి డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం ఇక్కడి పేదల‌కు త‌ల‌కుమించిన భారంగా మారింద‌ని మంత్రి తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే ఈరోజున బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాన‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీబాధితులు వ్యయ‌ప్రయాస‌ల‌ కోర్చి దూర‌ప్రాంతాల‌కు వెళ్లే బాధ త‌ప్పుతుంద‌న్నారు. త‌మ ఊళ్లోనే ఉచితంగా డ‌యాల‌సిస్ చేయించుకునే అవ‌కాశం దొరుకుతుంద‌ని తెలిపారు. యువగళం సందర్భంగా కుటుంబ సభ్యుడి మాదిరిగా త‌న‌పై అభిమానాన్ని చూపి, ఈరోజు రాష్ట్రప్రజలకు సేవ చేసుకునే అవకాశమిచ్చిన ప్రజలందరికీ మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com