ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబరు 29న భూమిపైకి మినీ చంద్రుడు,,,రెండు నెలల పాటు భూకక్ష్యలో పరిభ్రమణం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:24 PM

పిల్లలు తినడానికి మారాం చేస్తే.. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ తల్లులు గోరు ముద్దలు పెడుతుంటారు.. ఇది నిజం కాబోతోందని, చంద్రుడి భూమిపైకి వచ్చి దాదాపు రెండు నెలల పాటు ఉంటాడని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షం నుంచి ఒక గ్రహశకలం భూమిపైకి వస్తుందని.. అది గురుత్వాకర్షణ పరిధిలో సంచరిస్తుందని చెబుతున్నారు. నాసాకు చెందిన అట్లాస్ పరికరం ద్వారా ఆగస్టు 7న గుర్తించిన 2024 PT5అనే 10 మీటర్ల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ పరిభ్రమిస్తుందని ఇటీవల అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ రీసెర్చ్ నోట్స్‌ ప్రచురించిన నివేదిక పేర్కొంది.


తాజాగా, దీనిపై భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పందించింది. భూమి చుట్టూ 53 రోజుల పాటు తిరిగే ఈ మినీ-చంద్రుడ్ని నేరుగా చూడలేమని ఇస్రో స్పేస్ ఆబ్జెక్టివ్స్ ట్రాకింగ్ అండ్ ఎనాలిసిస్ (నేతా) చీఫ్ డాక్టర్ ఏకే అనిల్ కుమార్ ధ్రువీకరించారు. సాధారణ చంద్రుడి కంటే పరిమాణంలో 350,000 రెట్లు చిన్నదిగా ఉండే ఈ గ్రహశకలం ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం లేదని ఆయన చెప్పారు. సెప్టెంబరు 29 నుంచి నవంబరు 25 వరకూ భూమి చుట్టూ తిరుగుతూ.. తిరిగి సౌరవ్యవస్థలోకి వెళ్లిపోనుందని అనిల్ అన్నారు.


2024 పీటీ5 గ్రహశకలానికి మహాభారతంతో సంబంధం ఉన్న దీని కక్ష్య లక్షణాలు అర్జున గ్రహశకలం బెల్ట్ నుంచి వచ్చిన ఆస్టరాయిడ్‌ను పోలి ఉంటాయి. ఇదే విషయాన్ని నేత్రా చీఫ్ డాక్టర్ అనిల్ ధ్రువీకరించారు. సౌర వ్యవస్థలో ‘అర్జున’ గ్రూప్ అనేది ముఖ్యమైన ఆస్టరాయిడ్ వర్గం. దీనిని 1991 నవంబరు 1న ఆస్ట్రేలియాకు చెందిన స్ప్రింగ్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్ మెక్‌నాట్ కనుగొన్నారు. తొలుత దీనిని 1991 వీజీగా పిలిచేవారు. తర్వాత మహాభారతంలో అర్జునుడ్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ వీరుడి పేరు పెట్టారు. అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్ అధికారికంగా దీనికి ఆమోదం వేసింది.


హిందువులు పంచమవేదంగా చెప్పుకునే మహాభారతంలో అర్జునుడు గొప్ప వీరుడు. విలువిద్యలో ఆయన్ను మించినవారు లేరు. అర్జునుడు సంధించిన బాణాలకు తిరుగుండదని అంటారు. సౌరవ్యవస్థలో ఈ గ్రహశకలాల సమూహం కూడా కిరీటి బాణం లాగే దూసుకెళ్తుంది. అందుకే దీనికి ఆ పేరును సూచించారు. ఖగోళ పరిశోధకులు కార్లోస్ డి లా ఫ్యూంటె మార్కోస్, రౌల్ డి లా ఫ్యూంటె మార్కోస్ రచించిన నివేదికలో భూమి తనకు సమీపంలో ఉండే గ్రహశకలాలను పట్టుకుని ... తన కక్ష్యలోకి లాక్కుంటుందని తెలిపారు. ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు మన గ్రహం చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో తిరిగి .. కక్ష్యను పూర్తి చేసే ముందు భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి. ఇలా మినీ-చంద్రుడు భూమిపైకి రావడం ఇదే మొదటిసారి కాదు. 1997, 2013, 2018లోనూ వచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com