ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ నూతన సీఎంగా అతిషి.. హస్తినకు మూడో మహిళా ముఖ్యమంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 11:40 PM

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషీ మార్లెనాను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. మంగళవారం జరిగిన ఆప్ శాసనసభాపక్షం సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఆమెకు మొగ్గుచూపారు. ఆప్ నేత దీలీప్ పాండే.. ఆమె పేరును ప్రాతిపదించగా మిగతా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్థానంలో వేరే వ్యక్తి సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎంగా ఎవరుండాలనే అంశంపై ఆప్ నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించి.. చివరకు అతిషీ పేరును ఖరారు చేశారు.


ఇక, మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాను కలిసి.. తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ అందజేయనున్నారు. అనంతరం అతిషీతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని కోరనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో నాలుగు నెలలే సమయం ఉండటంతో ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించే వ్యక్తి చేతికే పాలనా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో పార్టీలోని పలువురు పేర్లను పరిశీలించి, నేతల అభిప్రాయాలను సేకరించారు.


ప్రస్తుతం కేజ్రీవాల్ క్యాబినెట్‌లో విద్య,, పీడబ్ల్యూడీ వంటి శాఖల మంత్రిగా ఉన్న అతిషీ.. ఆప్‌లో నెంబరు 2‌గా కొనసాగుతున్నారు. 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని, ప్రతిష్ఠాత్మక రోడ్స్ స్కాలర్‌షిప్ కూడా సాధించారు. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన తర్వాత విద్యా శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. ఆమెపై ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అపారమైన నమ్మకం.


కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే పనిచేశారు. తొలిసారి బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్‌లు ఢిల్లీ సీఎంలుగా ఉన్నారు. వారి తర్వాత ఢిల్లీ సీఎం పదవి చేపడుతోన్న మూడో మహిళ అతిషీ. ఇక, అతిషీపై ఆప్ అదినాయకత్వానికి అపారమైన నమ్మకం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్‌కు ఆమె నమ్మిన బంటు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పరిపాలన ఆమె ద్వారానే సాగింది. జైలుకు వెళ్లినప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేసి.. ఆమెకు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన రాజీనామా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com