ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 10:10 PM

అమరావతి రైతులకు అలర్ట్.. ప్రభుత్వం కౌలు డబ్బులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి సీఆర్‌డీఏ కౌలు డబ్బులు జమ చేసింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గతంలో 28 వేల 656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారు. అయితే 2014 నుంచి వీరందరికీ ప్రభుత్వం ఏటా కౌలు చెల్లిస్తూ వస్తోంది. తొలుత పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయించారు. టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తూ వచ్చింది. అయితే ముందుగా అనుకున్న పదేళ్ల గడువు ఇటీవల ముగియగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్న ప్రతి ఎకరానికి మరో ఐదేళ్లు వార్షిక కౌలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు అమరావతి రైతులకు కౌలు డబ్బులు జమచేశారు.


మరోవైపు ఇప్పటి వరకూ ఎకరానికి ఎంత మొత్తమైతే వార్షిక కౌలు చెల్లిస్తున్నారో.. అంతే మొత్తాన్ని సీఆర్‍డీఏ రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఇక అమరావతి రైతుల వార్షిక కౌలు చెల్లింపుల కోసం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ రూ.400 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులను రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు విడుదల కూడా చేసింది. ఆ నిధుల నుంచే ప్రస్తుతం చెల్లింపులు చేశారు. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో అమరావతికి ప్రాధాన్యం పెరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో అమరావతిన నిర్మాణ పనులు ఆగిపోగా.. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ పనులను తిరిగి ప్రారంభించింది.


అందులో భాగంగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు 80 శాతం వరకూ పూర్తి కాగా.. మధ్యలో వర్షాలు ఆటంకం కలిగించాయి. ప్రస్తుతం వర్షాల సమస్య లేకపోవటంతో.. రేపటి నుంచి (సెప్టెంబర్ 17) జంగిల్ క్లియరెన్స్ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరికొన్ని భూములు అవసరం కాగా.. మరోసారి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రైతుల ఇళ్లవద్దకు వెళ్లి మరీ.. అంగీకారపత్రాలు తీసుకుంటున్నారు. అలాగే వారు కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామని భరోసా ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com