ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ 8 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. పారిస్లోని 16వ అరోన్డిసెమెంట్లో గల రు ఎర్లాంగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.రు ఎర్లాంగర్లోని ఓ నివాస భవనంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భవనమంతా మంటలు వ్యాపించాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు.
అయితే అప్పటికే ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 28 మందిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇంకా కొందరు మంటల్లో చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. 7, 8వ అంతస్తులో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మంటల తాకిడి ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న భవనాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.