ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భుజాలపై కన్నబిడ్డల మృతదేహాలతో 30 కి.మీ. కాలినడకన సొంతూరుకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:55 PM

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలబోతున్నాం.. ఎంతో అభివృద్ధి సాధించేశామని చెంకలు గుద్దుకుంటోన్నాం. కానీ, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు, రవాణా వసతులు లేవు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల దుస్థితికి అద్ధం పట్టే హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తమ ఇద్దరు బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు గంటల వ్యవధిలో కన్నుమూయడంతో.. భార్యాభర్తలు ఆసుపత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూరుకి మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ కాలినడకన వెళ్లారు. కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన గడ్చిరోలి జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరీ తాలూకా పత్తేగావ్‌కు చెందిన రమేష్‌ దంపతులకు ఇద్దరు కుమారులు బాజీరావ్‌ (6), దినేష్‌ (3). బుధవారం ఆ పిల్లలు ఇద్దరూ జ్వరం బారినపడటంతో గ్రామంలోని నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు వారి ఏ మాత్రలు ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. ఉదయం 10 గంటలకు పెద్ద కుమారుడు బాజీరావ్, 12 గంటలకు చిన్న కుమారుడు దినేష్‌ మృతిచెందారు. కానీ, ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు కొనఊపిరితోనైనా ఉన్నారేమోనని ఆశతో వారిని 15 కి.మీ. దూరంలోని జిమ్మెలగట్ట ప్రాథమిక ఆసుపత్రికి కాలినడకన తీసుకువెళ్లారు.


అక్కడి వైద్యులు ఆ చిన్నారులను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. గ్రామానికి మట్టి రోడ్డు ఉండటంతో భారీ వర్షాల వల్ల వాహనాల రాకపోకలకు అనుకూలించలేదు. దీంతో పాటు ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ దంపతులు పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి.. భారమైన గుండెలతో తమ పిల్లల మృతదేహాలను భుజాలపై వేసుకొని సొంతూరుకు బయలుదేరారు. జిమ్మెలగట్ట నుంచి 15 కి.మీ. కాలినడకన నదులు, కాలువలు దాటుకుంటూ స్వగ్రామానికి చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.


మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉండే గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగడ్, ఏటపల్లి అహెరీ లాంటి తాలూకాల్లో పలు గ్రామాలకు ఇంకా సరైన వైద్య, రవాణా సదుపాయాలు లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు జిల్లా వైద్యాధికారి ప్రతాప్‌ జాదవ్‌ తెలిపారు. కాగా, గతంలోనూ ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించడానికి డబ్బుల్లేక సైకిల్‌పై తీసుకెళ్లిన ఘటన ఏపీలోని తిరుపతిలో గతేడాది చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com