ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 04:43 PM

భారీ వర్షాల కారణంగా బుడమేరు కాల్వకు గండ్లు పడ్డాయి.  దీంతో విజయవాడలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అయితే, ఇప్పుడు కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది. గురువారం సాయంత్రానికి బుడమేరు వరద మరింత పెరుగింది. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెనుమాక లంక, నందిగామ లంక, ఇండ్లు పాడు లంక, మనుగులూరు లంకకి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు భయంతో చెరువుల చుట్టూ వలలు కట్టేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.
ఇక, కొల్లేరులో నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండగా.. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వాగులతోపాటు కృష్ణ కాల్వల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తుంది. భారీ వరదలతో లంక గ్రామాల చుట్టూ ఇప్పటికే పూర్తిగా నీరు చేరింది.
కొన్ని లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్నింటికి ప్రమాదం పొంచి ఉంది. పూర్తిగా ఆక్వా రైతులు నష్టపోయారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు, రామిలేరు ఉధృతితో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, సోల్రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి నీరు చేరుతోంది. మండవల్లి మండలం, పెద్ద యడ్లగాడి -పెనుమాకలంక ఏలూరు రూరల్ మండలం, గుడివాక లంక, ప్రతి కోళ్ల లంక, గ్రామాలకు వెళ్లే రోడ్డులో బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. ఇప్పటికే 3 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. మరో అర మీటరు పెరిగితే కొల్లేరు అసాంతం మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు -ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని కొల్లేరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com