వాషింగ్టన్: వీసాల దుర్వినియోగం ఆరోపణలపై అమెరికాలో అరెస్టయిన విద్యార్థులందర్నీ సోమవారంలోగా మనదేశ దౌత్యాధికారులు కలవనున్నారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ శృంగ్లా ఆదివారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అరెస్టయిన విద్యార్థులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అమెరికా వ్యాప్తంగా అన్ని నిర్బంధ కేంద్రాలకు దౌత్యాధికారులు వెళ్తున్నారని.. విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. అరెస్టయిన వారందర్నీ సోమవారంలోగా కలుస్తామన్నారు. ప్రస్తుతం అనుసరించేందుకు వీలుగా ఉన్న పలు న్యాయమార్గాలను విద్యార్థులకు తాము వివరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల అరెస్టు వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించి, వారికి సహాయం చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ నుంచి తమకు ఆదేశాలు అందాయని హర్షవర్ధన్ వెల్లడించారు.
అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వల పన్ని, నకిలీ వర్సిటీని ఏర్పాటుచేసి, విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న 130 మంది విద్యార్థులతోపాటు ఎనిమిది మంది దళారులను బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన విద్యార్థుల్లో ఒక్కరు మినహా అందరూ భారతీయులే.