ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఏ ఇంటిలో చూసినా ఆ మాత్రల స్ట్రిప్పులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 02:49 PM

ఎన్టీఆర్ జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో కిడ్నీ బాధితులను ఆదుకోవాలని కోరుతూ కమ్యూనిస్ట్‌లు చేపట్టిన ధర్నాలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు తాము వాడుతోన్న మాత్రల అట్టలను రెవెన్యూ ఆఫీసు ముందు కుప్పలుగా పోసి.. ఈ సమస్య తమను ఎంతగా పీడిస్తుందో తెలియజేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరులో ‘కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలి’ అంటూ శనివారం సీపీఎం ధర్నా చేపట్టింది. దీంతో అక్కడి గిరిజనులంతా వ్యాధి తీవ్రత చెప్పేందుకు తాము వాడుతున్న మాత్రల ఖాళీ స్ట్రిప్స్‌ను తెచ్చి కుప్పలుగా పోశారు.


 కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న భూక్యా వెంకన్నబాబు అనే పాతికేళ్ల యువకుడు చక్రాల బండిలో ధర్నాకు వచ్చి.. ఈ సమస్య ఎంతలా పట్టిపీడిస్తుందో వివరించాడు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఏకైక గిరిజన మండలమైన ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలని కోరారు. తండాలకు శుద్ధమైన తాగునీరు అందజేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. బాధితులకు పెన్షన్, నియోజకవర్గంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ జిల్లాలో గత పదేళ్లలో కిడ్నీ వ్యాధితో 300 మంది మృతి చెందారని, ప్రస్తుతం 2 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆయన తెలిపారు. 110 మందికిపైగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. మండలంలో గిరిజన, దళిత, బలహీన వర్గాలు, పేదవారు కిడ్నీ వ్యాధి బారిన పడి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 63 మంది మృతి చెందారని బాబూరావు వెల్లడించారు. తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానంగా మారాయని, రోజురోజుకీ రోగులు పెరుగుతున్నారని ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్తు తరాల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని, ప్రజల ప్రాణాలను ప్రభుత్వాలు ఆదుకుని, యువత భవిష్యత్తును పరిరక్షించాలని కోరారు.


ప్రతినెల కిడ్నీ రోగులకు ఔషధాలు, ఇతర వైద్య ఖర్చుల కోసం రూ.10,000 వరకు ఖర్చు పెడుతున్నారని, సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు జిల్లాలో కిడ్నీ బాధితులు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని ఖర్చు పెడుతున్నారని చెప్పారు. గిరిజన తండాల్లో 20 నుంచి 30 శాతం కుటుంబాలు కిడ్నీ వ్యాధి బారినపడ్డారని, కిడ్నీ వ్యాధికి తోడు ఈ మండలాల్లో విష జ్వరాలు, టైఫాయిడ్, చికెన్ గున్యా లక్షణాలతో జ్వరాలు విజృంభించాయని ఆయన అన్నారు. అత్యధిక గ్రామాల్లో 30 శాతం వరకు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని, ప్రతి ఇంటిలోనూ జ్వర బాధితులు ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రజారోగ్యం క్షీణిస్తోందని, గత ప్రభుత్వం కృష్ణానది జలాలు అందించే నీటి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని అరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com