ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 09:39 PM

గత 15 రోజులుగా దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ వ్యవహారంలో నిందితుడికి సంబంధించి.. కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన రోజు.. నిందితుడు సంజయ్ రాయ్.. ఏం చేశాడు అనేదానిపై కోల్‌కతా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆ రోజు మద్యం సేవించిన నిందితుడు సంజయ్ రాయ్.. మరో వ్యక్తితో కలిసి కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు అక్కడే తిరిగి.. చివరికి తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లి.. బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌.. ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రిలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేయడానికి కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ఆగస్టు 8 వ తేదీన అప్పటికే మద్యం తాగిన సంజయ్ రాయ్‌.. రాత్రి అదే ఆస్పత్రిలో పనిచేసే మరో సివిక్‌ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని రెడ్‌ లైట్‌ ఏరియాలకు వెళ్లినట్లు చెప్పారు. వారిద్దరు కలిసి ఓ బైక్‌ను రెంట్‌కు తీసుకుని.. మొదట సోనాగచి ప్రాంతానికి అర్ధరాత్రి వేళ వెళ్లినట్లు గుర్తించారు. సంజయ్ రాయ్‌.. వేశ్యా గృహం బయట ఉండగా.. అతడి ఫ్రెండ్ లోపలికి వెళ్లాడని తెలిపారు.


ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వారిద్దరూ వెళ్లారని.. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సంజయ్ రాయ్‌ తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మద్యం మత్తులో ఉన్న సంజయ్ రాయ్.. ఆ మహిళను నగ్న ఫోటోల కోసం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇక తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఆర్‌జీ కర్‌ ఆస్పత్రికి చేరుకున్న సంజయ్ రాయ్.. మొదట ఆపరేషన్‌ థియేటర్‌ తలుపును పగలగొట్టినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 4.03 గంటలకు ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించాడని.. అనంతరం మూడో ఫ్లోర్‌లో ఉన్న సెమినార్‌ గదిలోకి వెళ్లి.. అక్కడ గాఢ నిద్రలో ఉన్న బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.


ఇక అదేరోజు రాత్రి 11 గంటలకు ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి వెనకాల సంజయ్ రాయ్‌ మద్యం సేవించి.. పోర్న్‌ వీడియోలు చూశాడని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం తాగిన తర్వాత 4 సార్లు ఆస్పత్రి ప్రాంగణంలో కలియతిరిగినట్లు పోలీసులు చెప్పారు. ఇక బాధితురాలు మృతి చెందిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చిందని.. ఆ రోజున 10.53 గంటలకు బాధితురాలి కుటుంబ సభ్యులకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొదట ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా.. ఆ తర్వాత హత్య అని తేలింది. ఈ క్రమంలోనే సెమినార్‌ హాల్‌లోకి నిందితుడు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారడంతో.. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com