ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్కాంపై చర్చించాల్సిందే... రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:10 PM

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో తాజాగా ఓ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే ఆ చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. అంతేకాకుండా రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది.


మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - ముడా కుంభకోణంపై కర్ణాటక అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రంతా అసెంబ్లీలో నిద్రపోయి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక సమావేశాల సందర్భంగా బుధవారం చర్చకు బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా.. స్పీకర్ అనుమతించలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్య, స్పీకర్ ఖాదర్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే రాత్రంతా నిద్రించారు. ఈ నిరసనలో విధానసభలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి, సీటీ రవి సహా బీజేపీ, జేడీఎస్‌తోపాటు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉన్నారు.


  ముడా స్కామ్‌కు సంబంధించి ప్రతపక్షాలు సభలో చర్చకు పట్టుబట్టగా అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ దాన్ని తిరస్కరించి సభను వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ లోపల నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ తెంగినాకై.. సిద్ధరామయ్య ప్రభుత్వం ముడా కుంభకోణంపై చర్చించే వరకు ఈ నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు. ముడా కుంభకోణాన్ని ఖండిస్తూ.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఈ ముడా కుంభకోణం విలువ రూ.4 వేల కోట్లు అని.. భూసేకరణ, ప్లాట్ల కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగిందని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్ వెల్లడించారు.


మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం స్వాధీనం చేసుకున్న భూమిలో అవినీతి జరిగిందని.. భూసేకరణ, ప్లాట్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని గత కొంతకాలంగా కర్ణాటకలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తన భార్య పార్వతి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని అప్పగించారని.. దాన్ని ముడా స్వాధీనం చేసుకుని పరిహారంగా మైసూరులోని ఒక మార్కెట్ ప్రాంతంలో ఎక్కువ విలువ కలిగిన సైట్లు కేటాయించారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com