ఓ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేయకున్నా.. తన ఇంటికి ఆన్లైన్లో వస్తువులు డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ నిత్యం క్యూ కట్టేవారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు రోజూ ఇదే తంతు కొనసాగింది. అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడంతో.. ఆ వస్తువులు ఇచ్చే సమయంలో డెలివరీ బాయ్స్ డబ్బులు కట్టాలని సూచించేవారు. అసలు తాను అవి బుక్ చేయలేదని.. తనకు అవి అవసరం కూడా లేదని వారు ఆమె తెగేసి చెప్పేది. చివరికి ఈ టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం వెల్లడైంది. ఆ యువతి ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే ఓ బాలుడే ఇవన్నీ చేశాడని గుర్తించారు. ట్యూషన్ టీచర్పై ప్రేమ పెంచుకున్న ఆ బాలుడు.. ఆమె దూరం పెట్టడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా ఆమె పేరుతో ఆమె ఇంటికి ఆన్లైన్ డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నగరంలోని పెరియామెట్ ప్రాంతంలో ఉండే 22 ఏళ్ల యువతి.. ట్యూషన్లు చెప్పేది. ఈ క్రమంలోనే ఆమె వద్ద ట్యూషన్ కోసం వచ్చిన ఓ 17 ఏళ్ల బాలుడు.. ఆమెను ప్రేమించాడు. అయితే ఆ బాలుడి ప్రవర్తనతో అనుమానం వచ్చిన ఆ యువతి మెల్లగా దూరం పెట్టడం ప్రారంభించింది. అయితే తాను ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలని బాలుడు.. ఆమెను టార్చర్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ట్యూషన్ టీచర్ ఇంటి అడ్రస్ తీసుకుని ఆమె పేరుతో ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేవాడు. వాటికి డబ్బులు ఆన్లైన్లో చెల్లించకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేవాడు. దీంతో ఆ వస్తువులు తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్.. డబ్బులు కట్టి వస్తువులు తీసుకోవాలని సూచించేవారు.
ఈ క్రమంలోనే ఆ యువతి పేరు మీద 2 రోజుల్లోనే 100 కుపైగా ఆర్డర్స్ బుక్ చేశాడు. ఒక డెలివరీ బాయ్ని పంపించేసరికి మరో డెలివరీ బాయ్ ఇంకో ఆర్డర్తో ఇంటికి వచ్చేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా ఆర్డర్ల మీద ఆర్డర్లు రావడంతో ఆ యువతి కుటుంబం తీవ్ర అసహనానికి గురైంది. ఇక ఆ ఆన్లైన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి తిరిగి పంపిస్తున్నప్పుడు కొందరు డెలివరీ బాయ్స్ ఆమెను తిట్టే వాళ్లని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక టూత్ పేస్ట్ నుంచి ఇంట్లో వాడే పామ్ ఆయిల్ వరకు అన్ని వస్తువులను ఆ బాలుడు ఆర్డర్ పెట్టాడు. ఇవే కాకుండా ఓలా, ఊబర్ ట్యాక్సీలు కూడా భారీగా బుక్ చేయడంతో ఆ యువతి ఫోన్.. కాల్స్తో మోగి పోయేది.
దీంతో కావాలనే ఎవరో ఇలా చేస్తున్నారని గుర్తించిన యువతి కుటుంబం.. చివరికి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఆన్లైన్ ఆర్డర్లు పెట్టి తమను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రేమ పేరుతో తిరిగిన మైనర్ స్టూడెంటే ఆమెను ఇలా టార్చర్ చేసినట్టు గుర్తించారు. ఆ బాలుడు వాడే ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ బాలుడికి మానసిక పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.