ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరిగిపడ్డ కొండ చరియలు.. 157 మంది దుర్మరణం

international |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:26 PM

ఆఫ్రికా ఖండంలోని దేశమైన ఇథియోపియాలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొండ చరియలు విరిగిపడటంతో 157 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. బురద, మట్టి, రాళ్ల కింద మరింత మంది ప్రజలు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మళ్లీ మళ్లీ వర్షం పడటం, కొండ చరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.


దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ ఘోర విషాదం జరిగింది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో.. దాని నుంచి వచ్చిన బురద కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కొండ చరియల కింద చిక్కుకుని చిన్న పిల్లలు, గర్భిణీలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఈ ఘోరం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఒక రోజు ముందు మరో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది బాధితుల కోసం వెతకుతున్నారు. సోమవారం ఉదయం కూడా కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రజలు సమాధి అయ్యారని పేర్కొన్నారు.


  అయితే కొండ చరియలకు సంబంధించి శిథిలాల నుంచి ఐదుగురు స్థానికులను ప్రాణాలతో బయటకు తీసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి, తండ్రి, అన్నా, అక్కలు సహా కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన చాలా మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. సోమవారం వరకు మృతుల సంఖ్య 55 ఉండగా.. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం వరకు మరణించిన వారి సంఖ్య 157కి పెరిగిందని చెప్పారు. అయితే జులైలో ఇథియోపియాలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. సెప్టెంబర్ మధ్య వరకు ఇథియోపియాలో వర్షాకాలం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.


ఈ క్రమంలోనే ప్రమాదంపై స్పందించిన ఇథియోపియా అధికారులు.. కొండ చరియల కింద మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు చాలా ఉన్నాయని.. వాటిని బయటకు తీయలేకపోయామని పేర్కొంటున్నారు. మృతదేహాలను బయటికి తీసుకునేందుకు గాలింపు ఆపరేషన్ కొనసాగుతోందని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. మట్టిని తొలగించే యంత్రాలు లేనందున.. చేతులతో సిబ్బంది ఎర్రమట్టిని తవ్వుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం గోఫా రాజధాని అడిస్ అబాబా నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com