ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పదవి కోసం రేసులో ముగ్గురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 50 రోజులు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే విప్‌లను కూడా నియమించాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. చీఫ్ విప్‌తో పాటుగా ఏడుగురు విప్‌లను బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే జనసేన పార్టీ తరుఫున ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.


ఇక భారతీయ జనతా పార్టీ నుంచి విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును విప్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టీడీపీ పార్టీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు విప్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన కూడా రేపే ఉంటుందని సమాచారం. చీఫ్ విప్ రేసులో టీడీపీ నేతలు బీటీ నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరికి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఛాన్స్ ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి.


బీటీ నాయుడు విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అలాగే కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగానూ బీటీ నాయుడు వ్యవహరిస్తున్నారు. ఇక ధూళిపాళ్ల నరేంద్ర విషయానికి వస్తే పొన్నూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపొందారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు నరేంద్ర . 1994 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓటమి పాలైన ఆయన.. 2024లో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీద 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


ఇక జీవీ ఆంజనేయులు విషయానికి వస్తే వినుకొండ నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ తరఫున వినుకొండ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన జీవీ ఆంజనేయులు.. 2014లోనూ విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కుతుందనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com