కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీ గేట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గేట్ వద్ద వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కొని చించేశారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ``వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు లాక్కొని ఇష్టారీతిగా చింపే అధికారం ఎవరిచ్చారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, మీ టోపీల మీద ఉన్న సింహాలకు అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారని గుర్తుపెట్టుకోండి`` అని సభ్యుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులకు సీఎం వైయస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం పోలీస్ జులం నశించాలని వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు.