ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను మార్చిన సర్కార్.. తిరుమల శ్రీవారి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించింది. దర్శనాల నుంచి అన్న ప్రసాదాల వరకు.. హోటళ్ల దగ్గరి నుంచి లడ్డూ వరకు అన్ని విషయాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమలలో అన్నప్రసాదాలకు వాడే సరుకుల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఇక తిరుమల లడ్డూ నాణ్యత లేకపోవడానికి అందులో వినియోగించే నెయ్యే కారణం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వాటన్నింటినీ సరిదిద్ది ప్రక్షాళన చేస్తామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.