ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 10:40 PM

విద్యాదీవెన, వసతిదీవెన పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు పథకాలను గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రభుత్వం మారటంతో ఈ పథకాల్లో మార్పులు చేస్తారా లేదా కొనసాగిస్తారా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంలో క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని నారా లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగానే విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విధివిధానాలను తయారుచేయాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.


మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు చెల్లించకపోవటంతో కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఆగిపోయాయని నారా లోకేష్ ఆరోపించారు. ఇదే సమయంలో విద్యాశాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సాయంతో యువతలో అవగాహన కల్పించాలని నారా లోకేష్ సూచించారు. ఈ సమావేశంలోనే కాలేజీలో లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం ప్రస్తావనకు రాగా.. న్యాయపరంగా ఉన్న చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు ప్రారంభించాలని నారా లోకేష్ సూచించారు.


మరోవైపు గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాల్లోకి ఫీజులు వేసే విధానం ఉండేది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన పథకాలను తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థుల ఫీజులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత విద్యార్థుల తల్లులు వారం, పది రోజుల్లో కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సి ఉండేది. ఇక జగనన్న వసతి దీవెన కింద విద్యార్థుల హాస్టల్ ఫీజులను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. అయితే ఈ విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోనే ఫీజులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com