ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల బాలిక కేసులో సంచలనం.. బాడీకి రాళ్లు కట్టి నదిలో పడేసిన బాలుడి తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 08:32 PM

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అత్యాచారం కేసులో రోజుకొక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఘటన జరిగి వారం రోజులు దాటిపోయినా.. ఇప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముచ్చుమర్రి ఘటనపై విలేకర్ల సమావేశం నిర్వహించిన నంద్యాల ఎస్పీ.. అదిరాజ్ సింగ్ రాణా కీలక వివరాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు మైనర్ బాలురు.. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసేవారని నంద్యాల ఎస్పీ తెలిపారు. ఈ కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.


ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు.. ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక చనిపోయిన తర్వాత నిందితుల్లోని ఓ బాలుడి తండ్రి.. బాలిక మృతదేహాన్ని మాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ పిల్లలు కేసులో చిక్కుకుంటారనే ఉద్దేశంతోనే ఓ బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న కలిసి బాలిక మృతదేహం మాయం చేసినట్లు చెప్పారు. ఇద్దరూ కలిసి బాలిక మృతదేహాన్ని గడ్డిలో ఉంచి.. బైక్ మీద వనమలపాడు వరకూ తీసుకెళ్లారని పోలీసులు వివరించారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని పుట్టిలో నది మధ్యకు తీసుకెళ్లి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారని వెల్లడించారు. ఈ కేసులో వీరిద్దరినీ ఏ4, ఏ5గా చేర్చి అరెస్ట్ చేసినట్లు నంద్యాల పోలీసులు తెలిపారు.


ఏం జరిగిందంటే..


పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై 14 నుంచి 16 ఏళ్లు వయసు ఉన్న ముగ్గురు బాలురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన బాలురు.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెప్తుందనే భయంతో ఆ తర్వాత హత్య చేశారు. అయితే చిన్నారి కనిపించకపోవటంతో బాలిక తల్లిదండ్రులకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాలికను ముగ్దురు మైనర్ బాలురు తీసుకెళ్లినట్లు అక్కడే ఆడుకుంటున్న ఓ చిన్నారి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు.. ఆపై కాలువలో విసిరేసినట్లు బాలురు అంగీకరించారు.


ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. దీనిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. బాధితురాలి కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్ల సాయంతో మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దించారు.అయితే రాయి కట్టి నది మధ్యలో వేయటంతో కనిపెట్టడం కష్టంగా మారుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com