ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి షాక్.. రాజ్యసభలో మెజార్టీ మార్కుకు దూరంగా ఎన్డీఏ

national |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 10:55 PM

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగలింది. గత 10 ఏళ్లుగా మిత్రపక్షాలతో సంబంధం లేకుండా లోక్‌సభలో బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే గత 10 ఏళ్లుగా అధికారంలోనే కొనసాగుతున్నా.. రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా పెద్దల సభలో ఎన్డీఏ బలం మరింత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమితోపాటు ఇతర పార్టీల మద్దతు కలుపుకున్నా మెజార్టీ అందుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బిల్లులకు ఆమోదం కల్పించుకోవడం ఇప్పుడు బీజేపీకి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది.


మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి అసలు పరీక్ష ఎదురుకానుంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో రాజ్యసభలో అధికార ఎన్డీఏకు సంఖ్యా బలం కాస్త తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యసభలో నలుగురు నామినేటెడ్‌ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో ఎన్డీఏకు బలం తగ్గింది.


  గతవారం పదవీ కాలం ముగిసిన రాకేశ్‌ సిన్హా, సోనాల్‌ మనసింగ్‌, రామ్‌ షకల్‌, మహేశ్‌ జఠ్మలానీలు పదవీ విరమణ చేశారు. వీరిని నాన్‌ అలైన్డ్‌ సభ్యులుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నామినేట్‌ చేసినప్పటికీ.. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 86 కు పడిపోగా.. ఎన్డీఏ బలం 101కి తగ్గింది.


245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఇప్పుడు 19 స్థానాలు ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226 కు చేరగా.. మెజార్టీ మార్కు 114గా ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యా బలం 101 ఉండటంతో కనీసం మెజార్టీ మార్కుకు తగ్గలేదు. ఏడుగురు నామినేటెడ్‌.. ఇద్దరు ఇండిపెండెంట్ ఎంపీలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినా.. అంతా కలిపి మెజార్టీ మార్కు కూడా దాటడం లేదు. ఇక ఇండియా కూటమికి రాజ్యసభలో 87 మంది సభ్యుల మద్దతు ఉండటంతో రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్‌ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు ఎన్డీఏ కూటమి.. ఇటు ఇండియా కూటమిలో లేని బిజు జనతాదళ్, బీఆర్ఎస్, వైసీపీ లాంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి.


ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బిల్లులను ఆమోదించుకోవాలంటే.. ఇండిపెండెంట్‌లతో పాటు తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అవసరం ఏర్పడింది. రాజ్యసభలో బిజు జనతాదళ్‌ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా.. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో బీజేడీ ఎంపీలు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే, వైసీపీ మద్దతుతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నెగ్గే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు.. రాజ్యసభలో ఉన్న 19 ఖాళీల్లో జమ్మూ కాశ్మీర్‌ నుంచి నలుగురు, నామినేటెడ్‌ కేటగిరీలో మరో 4 స్థానాలు ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉండగా.. వాటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌లోనూ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com