ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి సులువుగా దర్శనం, గదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 08:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. టీటీడీ ఈవోను మార్చిన తర్వాత తిరుమలలో గతంలో ఉన్న అవకతవకలను సరిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. దర్శనం, గదులకు సంబంధించి దళారులు.. భక్తులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ రంగంలోకి దిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సేవల్లో దళారుల ప్రమేయం లేకుండా.. మరింత పారదర్శకంగా వ్యవహరించనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే భక్తులకు నేరుగా దర్శనం, గదులు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది .


ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ అందించే తిరుమల సేవలను అనేకమంది దళారులు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇక ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డీ టోకెన్లు, వసతి సేవల బుకింగ్‌లపైనా విచారణ జరిపింది. ఇందులో ఒకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి దళారులు భారీగా బల్క్ బుకింగ్‌లు చేసినట్లు విచారణలో గుర్తించారు.


 తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు పొందినట్లు తేల్చారు. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 గదులు బుకింగ్‌లు.. ఆన్‌లైన్ ఒకే ఈ మెయిల్ ఐడీని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాటిపై చర్యలు చేపట్టారు. ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక ఏడాదిలో 1279 డిప్ రిజిస్ట్రేషన్‌లు.. ఒకే మెయిల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు.. ఒకే ఐడీ ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ఎస్‌డీ సర్వదర్శనం టోకెన్లు పొందినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ సందర్భంగా బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్లు, ఈ మెయిల్‌లు, ఐడీ ప్రూఫ్‌లను రద్దు చేశారు.


ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి ఎలాంటి దళారులు లేకుండా నేరుగా సేవలు పొందేలా టీటీడీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్ ఐడీ ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. భక్తుల సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com