ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ ఇచ్చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 08:20 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తల్లికి వందనం పథకం హాట్ టాపిక్‌గా మారింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య ఇప్పుడు ఈ పథకం గురించి మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమల్లో ఏపీ ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ కూడా అదే రేంజులో కౌంటర్ ఇస్తోంది. తల్లులను మోసం చేసిన చరిత్ర వైసీపీది అంటూ అదే రేంజులో కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తల్లికి వందనం పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమది మాట తప్పే ప్రభుత్వం కాదన్న నిమ్మల రామానాయుడు.. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు అందిస్తామన్నారు. తల్లికి వందనం విధివిధానాలు గురించి చర్చిస్తున్నామన్న రామానాయుడు.. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.


మరోవైపు వైసీపీ నేతలు తల్లికి వందనం పథకం అమలుపై చేస్తున్న ఆరోపణలపైనా మంత్రి స్పందించారు. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్న రామానాయుడు.. తల్లులను మోసం చేసిన పార్టీ వైసీపీ అంటూ విమర్శించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి రాగానే ఒకరికే పరిమితం చేసిందని అన్నారు. అది కూడా ఏడాది తర్వాత అమలు చేశారన్న నిమ్మల.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా పూర్తికాకముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఏడాదికి పదిహేను వేలు అందిస్తామన్న నిమ్మల.. తమది మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వమని చెప్పారు.


మరోవైపు తల్లికి వందనం మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల ఆధారంగా ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని మార్గదర్శకాల్లో రాశారని.. ఇది ప్రజలను మోసం చేయడమే అంటూ వైసీపీ విమర్శలకు దిగింది. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో మాట తప్పుతున్నారంటూ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు. అయితే తల్లికి వందనం పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఆ తర్వాత ఏపీ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. విధివిధానాలపై చర్చిస్తున్నామని.. ఖరారు అయ్యాక గైడ్ లైన్స్ విడుదల చేస్తామని చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదంతా అవాస్తవాలు అని.. వాటిని నమ్మొద్దంటూ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com