ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మూడు నెలలు మీ అగచాట్లు చూశా.. అందుకే అప్పుడే మాటిచ్చా.. సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 08:37 PM

ఏపీలో మరో రెండురోజుల్లో పింఛన్ల పండుగ మొదలుకానుంది. అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. హామీ ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో పింఛన్ల పెంపుపై సంతకాలు చేశారు. దీంతో జులై నెల నుంచి పింఛన్లు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు చెప్పారు. అందరి మద్దతుతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ఓట్లేసి గెలిపించారో అవన్నీ నెరవేరుస్తా్మని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా పింఛన్ వేయి రూపాయలు పెంచామన్న చంద్రబాబు.. దివ్యాంగులకు రూ.3000 పెంచి రూ.6000 పింఛన్ అందిస్తున్నట్లు చెప్పారు.


మరోవైపు ఏపీలోని 65 లక్షల మంది పింఛనుదారులకు జులై ఒకటో తేదీన ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరగనుంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ జరగనుంది. ఇళ్లవద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుందన్న చంద్రబాబు నాయుడు.. ఎన్నికల సమయంలో అధికార వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. పింఛన్ల కోసం ఆ మూడు నెలలు వృద్ధులు పడిన కష్టాలు చూసి చలించిపోయానని చెప్పారు. ఎండలో, వడగాల్పుల మధ్య వారు పడిన కష్టాలను చూసి ఏప్రిల్ నెల నుంచే పెంచిన పింఛన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు లేఖలో రాసుకొచ్చారు.


మరోవైపు పింఛన్ల పెంపు వలన ఏపీ ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా మరో రూ.819 కోట్లు భారం పడనుంది. ఇక ఏప్రిల్ నెల నుంచే పెరిగిన పింఛన్లను అమలు చేస్తుండటంతో.. మూడు నెలల బకాయిలు రూ.3000 అదనంగా ఇవ్వనున్నారు. దీంతో మొత్తం రూ.7000 పింఛన్ పంపిణి చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్లకు ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరును ఈ కార్యక్రమానికి పెట్టినట్లు చంద్రబాబు నాయుడు లేఖలో వివరించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇళ్లవద్దకే పింఛన్ పంపిణీ జరుగుతుందన్న సీఎం చంద్రబాబు..ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని లేఖలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com