ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ఆఫీస్ వద్ద కలకలం.. మహిళ ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 07:39 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అయితే ఆ మహిళను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తరలించారు. అయితే సదరు మహిళ రాజమండ్రికి చెందిన దుర్గాదేవి అని తెలిసింది. వైసీపీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ తన 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో తనకు 1200 గజాల స్థలం ఉందని.. అయితే ఈ స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్ విజయలక్ష్మి కబ్జా చేశారని దుర్గాదేవి ఆరోపించారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమ సమస్యను తెలియజేద్దామని వచ్చామని.. అయితే కుదరలేదని దుర్గాదేవి దంపతులు వాపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. అయితే పోలీసులు అనుమతించలేదని దుర్గాదేవి చెప్పారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మెయిన్ గేట్ పక్కనే ఉన్న పోలీస్ క్యార్టర్స్ మీదకు దుర్గాదేవి చేరుకున్నారు. అక్కడి నుంచి కిందకు దూకేందుకు యత్నించారు.


అయితే మహిళ బిల్డింగ్ మీదకు చేరుకున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మహిళను కిందకు దింపి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకునే అవకాశం రాదనే బాధతోనే సదరు మహిళ ఈ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో విజయవాడలోని క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చెలరేగింది. చివరకు ఆ మహిళకు పోలీస్ స్టేషన్ తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com