ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ అకౌంట్లో రూ. 2 వేలు పడలేదా? పీఎం కిసాన్ డబ్బులు రాకుంటే.. వెంటనే ఈ పని చేయండి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 10:36 PM

రైతులు అంతా ఎప్పుడైనా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారని చెప్పొచ్చు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. జూన్ 18న వారణాసి కేంద్రంగా.. ఈ 17వ విడత నిధుల్ని రైతుల అకౌంట్లలోకి విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరి అకౌంట్లలోకి రూ. 2 వేలు వచ్చి చేరాయి. అయితే ఇదే సమయంలో కొందరు రైతుల ఆశలు మాత్రం అడియాశలయ్యాయి. ఈసారి కొందరికి ఈ స్కీం కింద డబ్బులు అందలేదు. దీంతో వాళ్లంతా అయోమయంలో పడిపోయారు. డబ్బులు తమకు ఎందుకు పడలేదోనని కంగారు పడుతున్నారు. అయితే డబ్బులు పడకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పనులు చేస్తే రైతులు సదరు డబ్బులు తిరిగి పొందొచ్చు.


>> రైతులు తప్పకుండా ఇ- కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సమీపంలోని మీ సేవకు వెళ్లి చేసుకోవచ్చు. లేదా నేరుగా ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ పోర్టల్‌లో ఇ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ అథెంటికేషన్‌తో ఇది పూర్తి చేయొచ్చు. నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకునేందుకు వీలుంటుంది. ఇ- కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు అందుతాయి.


>> పీఎం కిసాన్ కింద లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌ను కచ్చితంగా ఆధార్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయకుంటే వెంనటే బ్యాంకుకు వెళ్లి పని పూర్తి చేసుకోవడం మంచిది. అప్పుడే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడతాయి. లేకపోతే నష్టపోతారని చెప్పొచ్చు.


>> మరో ముఖ్యమైన అంశం.. పీఎం కిసాన్ స్కీమ్ కోసం అప్లై చేసిన సమయంలో ల్యాండ్ డాక్యుమెంట్స్ (భూమి పత్రాలు) సరిగా సమర్పించారో లేదా అని చెక్ చేసుకోవాలి. అవి సరిగ్గా అప్లోడ్ చేస్తేనే.. భూమికి తగ్గట్లుగా పీఎం కిసాన్ డబ్బులు అందుతాయి. అందుకే ఈ 3 పనులు కచ్చితంగా పూర్తి చేయడం మర్చిపోవద్దు.


>> పీఎం కిసాన్ డబ్బులు రాని వారు ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. దీని కోసం 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంది. ఇంకా పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ 18001155266, 155261 నంబర్లకు కూడా కాల్ చేయొచ్చు.


>> పీఎం కిసాన్ పథకం 2019లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఏటా రూ. 6 వేలు పంటసాయం కింద అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది కేంద్రం. ఇప్పటివరకు 17 విడతల నిధులు వచ్చాయి. తర్వాత 18 వ విడత నిధులు అకౌంట్లోకి పడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com