ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో టీడీపీ, జనసేన ఢిష్యుం.. ఢిష్యుం.. నాగబాబు కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:28 PM

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ సహకారంతో వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై కూడా జనసేన కార్యకర్తలు దాడి చేశారంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కడక్కడా టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.


ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. వీటిపై స్పందించారు. జనసేన నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జనసైనికులు అందరూ సంయమనం పాటించాలని కోరారు. "వన్నెపూడిలో జరిగిన ఉదంతం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాం. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కూడా మాకు సమాచారం ఉంది. ఈ విషయంపై పిఠాపురం కో ఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. జన సైనికులంతా సంయమనం పాటించాల్సిన సమయం ఇది" .. అంటూ నాగబాబు ప్రకటన విడుదల చేశారు.


"పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.., ఇంకో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారు. కో ఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారు. పిఠాపురం ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండే విధంగా పిఠాపురంలో జనసేన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం " అని నాగబాబు ప్రకటనలో తెలిపారు.


పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నారన్న నాగబాబు.. పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని తెలిపారు. తాను కూడా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని.. సమస్యలు ఏవైనా ఉంటే అందరం కూర్చొని పరిష్కారం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుందామని చెప్పారు. పిఠాపురంలో సాగు నీరు, తాగు నీరు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉన్నదనీ.. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు. సుద్దగడ్డ రిజర్వాయర్ పనులు సహా నియోజకవర్గం అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com