ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీకి మద్దతుగా చంద్రబాబు... నితీష్ కుమార్ లేఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 08:33 PM

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు. ఎన్డీయే కూటమి నేతల సమావేశం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, ఏక్‌నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్తాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్‌కు 32 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఎన్డీయేలో టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, ఎల్జేపీ కీలక పాత్ర పోషించనున్నాయి.


లేఖలు అందజేత


కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేసిన తీర్మానంపై 21 మంది నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను చంద్రబాబు, నితీశ్ కుమార్ అందించారు.


రాత్రి ఏడున్నర గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే కూటమి పార్టీల నేతలు కలవనున్నారు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం తమకు ఉందని భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందించనున్నారు. మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com