ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ ఉద్యోగులకు షాక్.. ఇన్ఫోసిస్ కఠిన నిర్ణయం.. మరీ ఇంత తక్కువేంటి

business |  Suryaa Desk  | Published : Sun, May 26, 2024, 10:05 PM

బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌లోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇది ఉద్యోగులకు నిరాశ కలిగించే విషయం అని చెప్పొచ్చు. ప్రతి 3 నెలలకు ఓసారి ఉద్యోగులకు అందించే వేరియబుల్ పే ను భారీగా తగ్గించింది. అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే భారీగా కోత విధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికానికి (జనవరి- మార్చి) సంబంధించి కేవలం 60 శాతం మాత్రమే వేరియబుల్ పే రూపంలో అందించినట్లు సమాచారం. ఈ మేరకు ఐటీ సంస్థ.. తమ ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్ చేసినట్లు తెలిసింది. కష్టసమయంలో ఇప్పటికే వేతనాల పెంపుపై నిరాశగా ఉన్న ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలోనూ అదే అనుభవం ఎదురైందని చెప్పొచ్చు.


ఐటీ సంస్థలు అన్నీ ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇది పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. చాలా వరకు 100 శాతం ఇవ్వవు. అయితే భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం జూనియర్ స్థాయి ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ఆఫర్ చేస్తూ వస్తోంది. మిగతా వారికి వారి పెర్ఫామెన్స్ ఆధారంగా, బిజినెస్ యూనిట్ ప్రదర్శనను బట్టి అందిస్తామని ప్రకటన చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ మాత్రం ఇలా వేరియబుల్ పే లో కోత విధించడం ఆందోళన కలిగిస్తోంది.


కిందటి ఆర్థిక సంవత్సం ఆఖరి త్రైమాసికంలో చాలా మంది ఉద్యోగులకు కేవలం 60 శాతం మాత్రమే వేరియబుల్ పే అందినట్లు ఇన్ఫీ ఉద్యోగులు చెబుతున్నారు. అంతకుముందు అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వీరికి వేరియబుల్ పే 73 శాతంగా ఉండగా.. జులై- సెప్టెంబర్ క్వార్టర్‌లో 80 శాతం, అంతకుముందు ఏప్రిల్- జూన్ సమయంలో 75 శాతంగా వేరియబుల్ పే ఉంది. ఈ లెక్కన ప్రతి 3 నెలలకు ఓసారి వేరియబుల్ పే తగ్గుతూ వస్తుందని చెప్పొచ్చు.


లెవెల్- 6 (పీఎల్ 6- మేనేజర్) అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులు (ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల్ని మినహాయించి) కనీసం 55 శాతం నుంచి గరిష్టంగా 85 శాతం వరకు వేరియబుల్ పే అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పీఎల్4, 5, 6 స్థాయి ఉద్యోగులు వరుసగా సగటున 70 శాతం, 65 శాతం, 57 శాతం చొప్పున వేరియబుల్ పే అందుకోనున్నారట. మంచి ప్రదర్శన కనబర్చిన కొందరికి మాత్రమే 75 శాతం నుంచి 85 శాతం వరకు వేరియబుల్ పే ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇక ఇదంతా ఉద్యోగులకు వారి ఇ-మెయిల్స్ ద్వారానే కంపెనీ తెలియజేసిందని.. మే నెల జీతంతో కలిసి ఇది చెల్లించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com