ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన పోలింగ్ ఆరో దశ

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:49 AM

లోక్‌సభ ఎన్నికల ఆరో దశ  ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా..ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 11 కోట్ల మంది ఓటర్లు 889 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఢిల్లీలో ఆరుచోట్ల సిటింగ్‌ ఎంపీలను మార్చిన బీజేపీకి, ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌, కాంగ్రెస్‌ మధ్యన గట్టి పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా ఆప్‌-04, కాంగ్రెస్‌-03 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపి.. బీజేపీ అభ్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరిచూపు ఢిల్లీ వైపు ఉంది.

మద్యం కేసులో జైలుపాలై బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఆప్‌ అధినేత, సీఎం కేజ్రీవాల్‌ ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలతో ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ ఎంపీ స్వాతి మలీవాల్‌ తనపై సీఎం నివాసంలోనే దాడి జరిగిందని ఆరోపించడం, ఈ కేసులో కేజ్రీ పీఏ విభవ్‌ అరెస్టు కావడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేగాక ఆప్‌, కాంగ్రెస్‌ తొలిసారిగా బీజేపీపై సంయుక్త అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఢిల్లీ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఆరో దశలో యూపీలోని 14, పశ్చిమబెంగాల్‌, బిహార్‌లో 8 స్థానాల చొప్పున, ఒడిసాలో 6, జార్ఖండ్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్‌ జరుగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


 


ఎవరు ఎక్కడ..?
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు ఢిల్లీలో ఓటు వేయనున్నారు. ఈ దశలో 11.13 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు. వీరిలో 5.84 కోట్ల మంది పురుషులు కాగా.. 5.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు ఓటింగ్‌ పూర్తయింది. కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఆరో దశతో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తి కానుంది.


 ప్రముఖులు వీరే..
బీజేపీ అభ్యర్థులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, ఇంద్రజీత్‌ సింగ్‌, క్రిషన్‌పాల్‌ గుర్జర్‌, మనేకా గాంధీ, సంబిత్‌ పాత్రా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ నేతలు దీపేందర్‌సింగ్‌ హుడా, రాజ్‌ బబ్బర్‌ తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు. ఢిల్లీలో ఉన్న తెలుగువారిని మెప్పించేందుకు శుక్రవారం ఆంధ్రా, తెలంగాణ భవన్‌లో భోజనం చేసి పలువురి దృష్టిని ఆకర్షించిన రాహుల్‌ గాంధీ మెట్రోలో కూడా ప్రయాణించారు. మరోవైపు..ఈ ఎన్నికలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై దాడులపై ప్రజల నిరసనకు సంకేతంగా నిలవాలని.. కాంగ్రెస్‌, ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేయాలని సోనియా వీడియో విడుదల చేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com