ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. ముగ్గురు పోలీసులకు అధికారులు షాక్

national |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 09:45 PM

బెంగళూరు నగర శివారులోని ఫామ్‌హౌస్‌లో ‘సన్ సెట్ టు సన్ రైజ్’ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మద్యం, మత్తు, మజా మాత్రమే ఉందని భావించిన పోలీసులకు.. దర్యాఫ్తులో విస్మయానికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై అధికారులు చర్యలు చేపట్టారు. పార్టీ గురించి ముందస్తు సమాచారం తెలిసినా.. పట్టించుకోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లోని ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ నారాయణస్వామి, కానిస్టేబుళ్లు దేవరాజ్, గిరీశ్‌లపై అధికారులు వేటు వేశారు. అలాగే, డిప్యూటీ ఎస్పీ, ఎస్సైలకు ఎస్పీ మల్లికార్జున్ మెమోలు జారీచేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.


 కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలోని 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. విజయవాడకు చెందిన లంకపల్లి వాసు తన పుట్టిన రోజు వేడుకల కోసం ఫామ్‌హౌస్‌ను బుక్ చేయడం.. ఈ పార్టీలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వారు ఉండటం సంచలనంగా మారింది. ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. పాజిటివ్‌గా తేలిన వారిలో నటి హేమ కూడా ఉందని, ఆమె రక్త నమూనాల్లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఉన్నట్టు తేలిందని సమాచారం. ఇక, రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు రూ.2 లక్షలని పోలీసులు వెల్లడించారు.


మరోవైపు, ఈ అంశం కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య సర్కారు ఐటీ రాజధానిని డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చేసిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెంగళూరులో అనైతిక కార్యకలాపాలు పెచ్చిమీరుతున్నాయని దుయ్యబట్టింది.


‘శాంతిభద్రతలు క్షీణించాయి.. ప్రభుత్వ గందరగోళం బట్టబయలైంది.. కాంగ్రెస్ ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులో ఎక్కడ చూసినా అనైతిక కార్యకలాపాలే జరుగుతున్నాయి. సిలికాన్ సిటీ ఇప్పుడు డ్రగ్స్, గంజాయి మందు రేవ్ పార్టీలతో నిండిపోయింది’ అని కర్ణాటక బీజేపీ విభాగం ట్వీట్ చేసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఫోటోలతో ఉడ్తా బెంగళూరు పోస్టర్‌ను ట్విట్టర్ పెట్టి.. #BadBengaluru, #CongressFailsKarnataka హ్యష్‌టాగ్‌లతో ట్రోల్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com