ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ ఉంది: బెంగళూరు కమిషనర్

national |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 09:19 PM

బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ ఉందా లేదా అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారింది. మొదట ఆ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరు పోలీసులు కూడా హేమ ఫోటోను విడుదల చేశారు. కానీ అదేమీ లేదంటూ హేమ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఆ వీడియోలో హేమ పేర్కొంది. అయితే హేమ విడుదల చేసిన ఫోటో.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లోనిదేనని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసలు హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లిందా లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే వీటన్నింటికి తెర దించుతూ తాజాగా బెంగళూరు కమిషనర్ ఒక ప్రకటన చేశారు. ఆ బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉందని ఆయన స్పష్టం చేశారు.


బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద తాజాగా స్పష్టం చేశారు. అయితే ఆమె రిలీజ్ చేసిన వీడియో లొకేషన్ ఎక్కడో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ రేవ్ పార్టీ చాలా ఖరీదైందని.. ఇందులో 100 మందికిపైగా పాల్గొన్నారని చెప్పారు. అయితే ఇందులో ఎవరూ ప్రజా ప్రతినిధులు లేరని తేల్చి చెప్పారు. ఈ ఈవెంట్‌కు "సన్‌సెట్ టు సన్‌రైజ్" అని పేరు పెట్టాకున్నారని.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద వెల్లడించారు. కొందరు మోడల్స్, తెలుగు టీవీ యాక్టర్లు.. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీకి హాజరయ్యారని సీపీ దయానంద స్పష్టం చేశారు.


ఇక ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర.. కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయిని ఈ రేవ్ పార్టీలో పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే కర్ణాటకను డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రగ్స్ వ్యాపారులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామని చెప్పారు.


బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఉన్న జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. బర్త్‌ డే పార్టీ పేరుతో నిర్వహించిన ఆ రేవ్‌ పార్టీలో మందుతో పాటు భారీగా డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డి అనే వ్యక్తిది అని పోలీసుల విచారణలో తేలింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నారని.. అందులో టాలీవుడ్‌కు చెందిన వారు ఉన్నారని బెంగుళూరు పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com