ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 23న బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను.. ఆ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు

national |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 10:04 PM

దేశంలోని పలు ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి అడపాదడపా వర్షాలు పడటంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే, పలు రాష్ట్రాల్లో మాత్రం మాడు పగిలే ఎండలు, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ్ బెంగాల్, ఒడిశాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్ది రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధిాకరులు భావిస్తున్నారు.


 ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. మే 20 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా బలపడి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఈ తుఫాను గమనం, తీవ్రత గురించి ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పింది. అయితే, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లో తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. మే 28న గుజరాత్, మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


మరోవైపు, మే 23న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మే 25న బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగేళ్ల కిందట మే 20న ఏర్పడిన అంఫన్ పెను తుఫాను బెంగాల్, ఒడిశాలో బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం ఏర్పడే తుఫాను కూడా అంత తీవ్రంగా ఉంటుందా? సూపర్ సైక్లోన్‌గా మారుతుందా? అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుందని ఐఎండీ నిపుణులు పేర్కొన్నారు. అటు, బంగ్లాదేశ్ వాతావరణ విభాగం కూడా దక్షిణ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు, దీనికి ఒమన్ ‘రెమల్’ అనే పేరును సూచించినట్టు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com