ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. స్వాతి మలివాల్ వాంగ్మూలంలో సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 10:01 PM

ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం మలీవాల్ నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అయితే, తన వాంగ్మూలంలో స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి తెగబడ్డాడని, సున్నితమైన అవయవాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నారు.


‘ముఖ్యమంత్రి నివాసంలో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ నాపై దాడి చేశాడు.. ఏడెనిమిదిసార్లు చెంపపై కొట్టి, కాలితో తన్నాడు.. కర్రతో కడుపుమీద, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు.. అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’ అని స్వాతి చెప్పినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు గుర్తించామని వైద్య వర్గాలు తెలిపాయి.


మే 13న కేజ్రీవాల్‌ నివాసంలోనే జరిగిన ఘటనపై స్వాతి మలివాల్ గురువారం తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దీనిని రాజకీయం చేయొద్దని బీజేపీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ‘నేను క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్లి సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌కు ఫోన్ చేశాను.. కాని నేను లోపలికి వెళ్లలేదు... అతడి మొబైల్ నంబర్‌కు (వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాను.. అయినా స్పందించి లేదు.


దీంతో ఎప్పటిలాగే మెయిన్ డోర్ గుండా లోపలికి వెళ్లాను.. అక్కడ ఉన్న సిబ్బందికి సీఎంను కలవడానికి వచ్చినట్టు చెప్పాలని అన్నాను..."అతడు ఇంట్లో ఉన్నాడని నాకు సమాచారం వచ్చింది.. నన్ను డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉండమని చెప్పారు.. అక్కడకు వెళ్లి సోఫాలో కూర్చుంటే... సీఎం వచ్చి కలుస్తారని సిబ్బంది ఒకరు చెప్పి వెళ్లారు.. ఇంతలోనే బీభవ్ కుమార్ వచ్చి గదిలోకి లాక్కెళ్లి దాడికి దిగాడు’ అని మలివాల్ వాపోయారు. కాగా, ఆప్‌ మాజీ మహిళా నేత షాజియా ఇల్మి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆరోపించారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com