ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతకుమించిన సంతోషం ఏముంటుంది.. రష్మిక వీడియోకు ప్రధాని మోదీ రిప్లై

national |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 10:00 PM

ఇటీవల ముంబైలో పర్యటించిన హీరోయిన్ రష్మిక మందన్న.. తన అనుభవాల గురించి ఒక వీడియో రూపంలో ట్విటర్ వేదికగా పంచుకుంది. ముంబై నగరంలో ఇటీవల ప్రారంభం అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ - ఎంటీహెచ్ఎల్‌పై రష్మిక మందన్న తొలిసారి ప్రయాణించింది. ఈ బ్రిడ్జికి కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేజ్ గౌరవార్థం అటల్ సేతు అని పేరు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన రష్మిక మందన్న.. ఆ అటల్ సేతు విశేషాలను వెల్లడించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు చేరింది. దీంతో రష్మిక మందన్న వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు.


ప్రజలను కనెక్ట్ చేయడం.. వారి జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది ఇంకొకటి లేదు అంటూ.. రష్మిక మందన్న ట్వీట్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్ కాస్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఆ వీడియోలో అటల్ సేతుపై అద్భుత ప్రయాణాన్ని రష్మిక మందన్న వివరించింది. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ ద్వారా వెళ్తే 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని పేర్కొంది. కారులో ప్రయాణిస్తూ.. ఆ అటల్ సేతుపై ఆగి మరీ.. రష్మిక మందన్న వీడియో చేసింది.


సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా.. వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు ప్రజలను కలుపుతుంది.. హృదయాలను కలుపుతుంది అంటూ ఆ వీడియోకు రష్మిక మందన్న క్యాప్షన్ పెట్టింది. అంతేకాకుండా మై ఇండియా అని హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది. భారత్‌లో సాధ్యం కానిది లేదు అనే పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్న రష్మిక.. గత 10 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపింది. ఈ వంతెన కేవలం 7 ఏడేళ్లలోనే పూర్తైందని తనకు ఇటీవలే తెలిసిందని.. మొదట ఈ అటల్ సేతను చూసినప్పుడు మాటలు రాలేదని తన అనుభవాలను పంచుకుంది. ప్రస్తుత యంగ్ ఇండియా.. అత్యంత వేగంగా దూసుకెళ్తోందని.. భారత్ చాలా తెలివైన దేశమని.. యువత ఇప్పుడు బాధ్యతగా అభివృద్ధికి ఓటు వేయాలని సూచించింది.


ఈ ఏడాది జనవరిలో ముంబై ట్రాన్స్ హార్బర్‌ లింక్‌ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అటల్ సేతు.. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ నిర్మించారు. మొత్తం రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా.. 21.8 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. ఇందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం. దీంతో మన దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన సీ బ్రిడ్జిగా ఈ అటల్ సేతు రికార్డుల్లోకి ఎక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com