ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారం గ్యాప్‌లో ఇద్దరిని.. వణికిస్తున్న ఒంటరి ఏనుగు.. ఊరి బయటకు వెళ్లాలంటేనే హడల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 07:54 PM

తిరుపతి జిల్లా పాకాల మండలాన్ని ఒంటరి ఏనుగు భయపెడుతోంది. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం. పల్లెవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో ఒంటరి ఏనుగు జాడకనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరి ఏనుగును బంధించి ఏనుగుల మందలో కలిపేందుకు.. తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో.. ఆ ఒంటరి ఏనుగు కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ ఒంటరి ఏనుగు ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకోవటంతో పాకాల మండలంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


మందలో నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు వారం రోజుల వ్యవధిలో ఇద్దరి ప్రాణాలను తీసింది. వారం క్రితం అరగొండ సమీపంలో ఓ వ్యక్తిపై ఒంటరి ఏనుగు దాడి చేయటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం వెంగంపల్లి వద్ద మరొకరిపై దాడిచేసి ప్రాణాలు బలితీసుకుంది. వెంగంపల్లె ఎస్టీ కాలనీకి చెండిన చిన్నయ్య అనే వ్యక్తి ఆదివారం ఉదయం బహిర్భూమి కోసం సమీపంలోని మామిడితోపులోకి వెళ్లాడు. అక్కడే అతనిపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఒంటరి ఏనుగును బంధించేందుకు వెళ్లగా.. అప్పటికే అది అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.


వారం రోజుల్లోనే ఇద్దరి ప్రాణాలను పొట్టనబెట్టుకోవటంతో ఇప్పుడు పాకాల మండలవాసులు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడిచేస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు.. పశువులు, గొర్రెలను అటవీప్రాంతంలోకి మేతకు తోలుకువెళ్లే కాపర్లు భయపడిపోతున్నారు, వెంటనే ఈ ఒంటరి ఏనుగును బంధించాలని అటవీ అధికారులను కోరుతున్నారు. అధికారులు సైతం ఒంటరి ఏనుగును బంధించి మందలో కలిపేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏనుగు జాడను గుర్తించేందుకు డ్రోన్లతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com