బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా అభివృద్ధి, సంక్షేమంతో సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. గురువారం కేశినేని చిన్ని మాట్లాడుతూ... కూటమి పార్టీల విజయం ఇప్పటికే ఖరారై పోయిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని అన్నారు. నిన్న(బుధవారం) విజయవాడలో నిర్వహించిన రోడ్ షో లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ రోడ్ షో మంచి జ్ఞాపకాన్ని మిగిల్చిందని మోదీ ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కాలికి గాయమైనా పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలని తెలిపారు.