చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి కానీ, ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందోదో ఆలోచన చేయాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆన్ గోయింగ్ పథకాలను అడ్డుకుంటున్నారని, రూ.14, 165 కోట్ల చెల్లింపులకు ఈసీ బ్రేక్ వేసిందని.. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతోందని దుయ్యబట్టారు. రైతులు, విద్యార్ధులు, మహిళలకు డబ్బులు చేరకుండా కుట్ర చేయడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాలడ్డు పెట్టిందని మండిపడ్డారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించిందన్నారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం వైయస్ జగన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.