ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పోస్టల్ బ్యాలట్ ఓటర్లకు ప్రలోభాలు.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అతి తెలివి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:01 PM

ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓటర్లకు ప్రలోభాల పర్వం నడిచింది. నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన వ్యవహారంపై దర్శి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్‌ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వారిపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌తెలిపారు.


ఓ పార్టీ తరపున నారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్‌ నంబర్లు సేకరించారు. అతడు గోవిందయ్యకు ఆ నంబర్లు ఇచ్చి అతడి యూపీఐ అకౌంట్ నుంచి రూ.20వేలు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆయన తన అకౌంట్ నుంచి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.ఐదువేల చొప్పున చెల్లించి ఓట్లు కొనుగోలు చేసినట్లు తేలింది. మరో పార్టీకి చెందిన చిన్నపురెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరిరెడ్డి అనే వ్యక్తికి రూ.55వేలు యూపీఐ ద్వారా బదిలీ చేస్తే ఆయన ఉద్యోగులకు రూ.ఐదువేల చొప్పున ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలింది. ఎన్నికల నియమావళి మేరకు ఓట్లు కొనుగోలుచేసిన వారితో పాటు తమ ఓట్లు అమ్ముకున్న ఉద్యోగులపైనా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఉద్యోగుల్ని సస్పెండ్ కూడా చేస్తామని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చేవారిపైనే కాకుండా లంచాలు తీసుకునేవారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దన్నారు. పోస్టల్ బ్యాలంట్ సౌకర్యాన్ని వినియోగించుకునే ఉద్యోగుల విషయంలో గత రెండు రోజుల నుండి పలు విమర్శలు వస్తున్నాయన్నారు. కొంత మంది ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందనే విషయం ప్రచారంలో ఉందన్నారు.


ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వంటి ప్రలోభాలకు లోబడటం అనేది చెడు సంకేతం అన్నారు. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను తీసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతడిని వెంటనే సస్పెండ్ చేశామన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేశామన్నారు.


ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంత మంది యుపీఐ విదానం ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపంచినట్లు గుర్తించామన్నారు మీనా. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సంబందిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణ చేయాలని ఆదేశించామన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిందని.. కొంత మంది వ్యక్తులను కూడా గుర్తించామన్నారు. కాల్ డేటా, బ్యాంక్ ట్రాంగ్జాషన్ ద్వారా దాదాపు ఎనిమిది నుండి పది మంది ఉద్యోగులను కూడా గుర్తించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com