ప్రతి పనికీ కమీషన్లు పంచుకునే తండ్రీకొడుకులకు తిరుపతి ప్రజలు భయపడాలా అని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి అభ్యర్థి అభినయ్రెడ్డిపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తిరుపతి రోడ్షోలో ఆయన మాట్లాడుతూ.. ఏడుకొండలవాడిని పైన పెట్టుకుని ఆకు రౌడీలకు భయపడడం ఏమిటని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం రాగానే ఆకు రౌడీలను ఉక్కు పాదంతో తొక్కిపడేస్తామన్నారు. ‘ఇల్లు కట్టాలంటే కరుణాకరరెడ్డికి 30 శాతం, ఆయన కొడుకు అభినయ్కి 10శాతం కమీషన్ ఇవ్వాలట కదా! రూ.200 కోట్ల కమీషన్ల కోసం తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూలదోసి కొత్తవి కడుతున్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు నొక్కేశారు. తిరుమల హుండీలో వేసిన కానుకలనూ దోపిడీ చేశారు. ప్రతి పనికీ పది నుంచి 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఖజనాకు ఆదాయం వస్తుంటే వైసీపీ నాయకులు కొండపై తిష్ఠవేసి ఖాళీ చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్లో కోట్లు గడించారు’ అని దుయ్యబట్టారు.