విజయవాడ నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అందకుండా చేసి పనులు లేకుండా చేశారన్నారు. కష్టపడి పని చేసుకునే వారి కార్మికులు కుటుంబాలను పస్తులు పెట్టారని మండిపడ్డారు. రాజధాని అమరావతిని చంపేసి కార్మికులు వలస వెళ్లేలా చేశారన్నారు. కార్మికులు ఉసురు, కన్నీరు జగన్కు తప్పకుండా తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు హాయంలో కార్మికులు కష్టం లేకుండా బతికారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పస్తులతో పడిన పాట్లు గుర్తు చేసుకుంటున్నారన్నారు. తమకొద్దీ జగన్ ప్రభుత్వం అని కార్మికులు తేల్చి చెబుతున్నారన్నారు. అనారోగ్యం పాలైతే మంచి వైద్యం అందక అవస్థలు పడుతున్నారన్నారు. వారు దాచుకున్న డబ్బు కూడా వాడేసుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారు. సీఎం స్థాయిలో మానవత్వంతో ఇచ్చే సీఎంఆర్ఎఫ్ కూడా ఆపేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. నేడు కార్మికులు అందరూ కూటమి ప్రభుత్వం రావాలని మనసారా కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.