ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 09:08 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. ఈ నెల 25తో ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో వైఎస్సార్‌సీపీ పునరాలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్థానంలో మరో నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చి నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.


గతవారం తెలుగు దేశం పార్టీ నేత ఆడారి కిషోర్‌ కుమార్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. టీడీపీలో తనకు గుర్తింపు లేదని.. కిషోర్ కుమార్ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. కిషోర్ బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. సామాజికంగా, రాజకీయంగా మంచి పట్టు ఉందనే భావనలో ఉన్నారట. ముత్యాలనాయుడి స్థానంలో ఆయన్ను ఎంపీగా దింపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.


అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధానంగా కాపు వెలమ, గవర సామాజిక వర్గాల ప్రజలే 75 శాతానికి పైగా ఉంటారు. గతంలో కూడా ప్రధాన పార్టీలు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున అవకాశం దక్కింది. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం రూటు మార్చి.. ఆడారి కిషోర్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఆడారి కిషోర్ కుమార్ మొదటి నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు.. ఆయన అనకాపల్లి సీటు ఆశించినా దక్కలేదు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మార్చే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు.


2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన సత్యవతి ఎంపీగా విజయం సాధించారు. ఆమెకు మరోసారి అవకాశం దక్కలేదు. అనూహ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడును ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దింపి.. ఆయన కుమార్తెకు మాడుగుల సీటు కేటాయించింది. అయితే ముత్యాల నాయుడు ఎంపీగా పోటీ చేయడంపై ఆసక్తిగా లేరని గతంలో చర్చ జరిగింది. అయితే రెండు రోజుల క్రితం జరిగిన సభలో ముత్యాల నాయుడ్ని ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ పరిచయం చేశారు. ముత్యాల నాయుడు ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో అభ్యర్థి మార్పు కష్టమే అన్న వాదన కూడా ఉంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com