ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 08:24 AM

గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున ప్రవాస భారతీయుడు డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో మొత్తం ఆస్తులను రూ.5,705.47 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 37 పేజీల అఫిడవిట్‌లో ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అమెరికా, గుంటూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఆస్తులను సమకూర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతపెద్ద మొత్తంలో స్థిర చరాస్తులను ఏ అభ్యర్థీ చూపించకపోవడం గమనార్హం. ఒకవిధంగా దేశంలోని అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థుల్లో పెమ్మసాని ఒకరుగా ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పెమ్మసాని కుటుంబం కొన్నేళ్ల పాటు నరసరావుపేటకు వలస వెళ్లి అక్కడ నివాసం ఉన్నది. అప్పట్లోనే పెమ్మసాని ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం ఎండీ చేయడానికి అమెరికా వెళ్లారు. సొంతంగా మెటీరియల్‌ తయారు చేసుకుని ఎండీని పూర్తి చేశారు. అప్పట్లో ఆయన రూపొందించిన మెటీరియల్‌ నేటికీ అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అలా అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. యూఎ్‌సలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. జేపీ మోర్గాన్‌ వంటి బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి. పెమ్మసాని పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్లు అప్పులు ఉన్నాయి. పెమ్మసాని కుటుంబానికి చరాస్తులు ఎక్కువగా ఉన్నాయి. పెమ్మసాని పేరు మీద రూ.2,316 కోట్లు, ఆయన సతీమణి శ్రీరత్న పేరుతో రూ.2,289 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. పిల్లల్లో ఒకరి పేరుతో రూ.496 కోట్లు, మరొకరి పేరు మీద రూ.496 కోట్ల చరాస్తులున్నాయి. స్థిరాస్తులు పెమ్మసాని పేరుతో రూ.69.33 కోట్లు, భార్య పేరుతో రూ.25 కోట్లు ఉన్నాయి. పెమ్మసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబం పేరుతో రూ.4.20 లక్షల విలువైన 5.5 కేజీల వెండి ఆభరణాలున్నాయి. సొంతం గా మెర్సిడెస్‌ బెంజ్‌-ఎస్‌ క్లాస్‌, సీ క్లాస్‌, టెస్లా మోడల్‌ ఎక్స్‌ క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, టోయోటా ఫార్చునర్‌ కార్లు ఉన్నాయి. వీటి విలువ వచ్చి రూ.6.11 కోట్లు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com