ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 08:50 PM

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత ఆదివారం కొంతమేర తగ్గింది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. ఆదివారం 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.4, ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 26 మండలాల్లో తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. అలాగే మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 88 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని చెబుతున్నారు.


అలాగే ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, కడప జిల్లా బలపనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 82 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని కూర్మనాథ్‌ కోరారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


ఏజెన్సీలో ఆదివారం మధ్యాహ్నం కూడా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించగా, మధ్యాహ్నం రెండు గంటల తరువాత వాతావరణం మారిపోయింది. సుమారు గంట సేపు వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత నుంచి మబ్బుల వాతావరణం కొనసాగింది. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు. ఏజెన్సీలో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు సైతం స్వల్పంగా తగ్గాయి. కొయ్యూరులో 39.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, పాడేరులో 37.4, పెదబయలులో 37.2, చింతపల్లిలో 36.0, జి.మాడుగులలో 35.0, హుకుంపేటలో 34.8 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


అరకులోయ మండలంలో ఆదివారం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఆ తర్వాత సుమారు గంటన్నర సేపు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన జనం వర్షానికి ఉపశమనం పొందారు. వర్షానికి రహదారులు బురదమయమయ్యాయి. చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులు బురదమయమయ్యాయి. జి.మాడుగుల మండలంలో కూడా అదే పరిస్థితి కనిపించింది ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. కుంబిడిసింగి పంచాయతీ గుర్రాయి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.


హుకుంపేట మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో ఒక విద్యుత్‌ స్తంభం కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే మెయిన్‌ రోడ్డులో ఓ టీ దుకాణంపై చెట్టు కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com