ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు రాజకీయ చాణక్యం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 07:22 PM

కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే మాట మనలో చాలా మంది వినే వింటారు. అంటే ఇటువైపు గానీ .. అటువైపు గానీ ఎలాంటి నష్టం జరగకూడదు. కానీ సమస్య పరిష్కారమైపోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం చూస్తే ఇది నిజమై అనిపిస్తుంది. 40 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపళ్లాలను చూసిన చంద్రబాబుకు.. 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీని సమర్థవంతంగా ఐదేళ్లు నడిపిన చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పూర్వవైభవం తీసుకు రావాలని భావిస్తున్నారు. అందుకోసమే విజయమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు.


వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు జనసేన, బీజేపీలతో టీడీపీ జట్టుకట్టింది. మూడు పార్టీలూ కలిసి ఎన్నికలు వెళ్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ నేతల్లో కొంతమందికి సీట్లు దక్కలేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిని ఎలాగోలా సర్దిచెప్పారు చంద్రబాబు. అలాగే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థుల బలబలాలను సైతం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే.. తమ పార్టీ నేతలే భాగస్వామ్య పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు.


అవనిగడ్డ, పాలకొండ విషయంలో ఇదే జరగ్గా.. ఇప్పుడు అనపర్తి సీటు విషయంలోనే ఇదే జరిగేట్లు కనిపిస్తోంది. అవనిగడ్డలో టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్.. టీడీపీని వీడి జనసేనలో చేరి టికెట్ సంపాదించారు. అలాగే పాలకొండలో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ తరుఫున బరిలో ఉన్నారు. ఇప్పుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా బీజేపీలోకి చేరతారనే వార్తలు వస్తున్నాయి.


తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై గత కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది. అయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ టికెట్ ఆశించారు. సీటు దక్కకపోవటంతో అసంతృప్తికి గురయ్యారు. కానీ పార్టీని వీడకుండానే అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. అలాగే తనకు టికెట్‌ కేటాయించాలని గట్టిగా పట్టుబడుతూ వచ్చారు. దీంతో కూటమి నుంచి ఎవరు పోటీలో ఉంటారా అనే ఆసక్తి నెలకొంది. చివరకు కూటమి తరుఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డే బరిలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ నుంచి కాకుండా బీజేపీ నుంచి నల్లమిల్లి బరిలో ఉంటారని సమాచారం. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు ఈ సమస్యను అలా పరిష్కరించారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com