ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ముహూర్తం మించిపోవడంతో వెనక్కి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 09:50 PM

ఎన్నికల్లో నామినేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ముహూర్తాలు, మంచి రోజులు చూసుకుంటారు. ఆ రోజు భారీగా ర్యాలీలు, ఊరేగింపుగా వచ్చి నామపత్రాలు దాఖలు చేస్తూ ఉంటారు. ఇక నామినేషన్లు దాఖలు చేసే చివరి నిమిషం వరకు ఆగి.. ఆఖర్లో నామినేషన్ వేసేవారు కూడా ఉంటారు. ఇలా చేసి ర్యాలీలు, రోడ్‌ షోలలో ఇరుక్కుపోయి.. అసలు నామినేషన్ గడువు ముగిసిన తర్వాత వెళ్లి ఉట్టి చేతులతో వెనక్కి వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ తాజాగా మాత్రం ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.


నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం చూసుకుని.. ఆ సమయానికి అక్కడికి వెళ్లాలి అని బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. భారీ ర్యాలీ నుంచి బయటపడటంతో ఆలస్యం కావడంతో ముహుర్త సమయం మించిపోయింది. దీంతో వెనక్కి వచ్చేసి నామినేషన్ కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేసుకున్నారు. ఈ అనుకోని సంఘటన గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు ఎదురైంది. దీంతో భారీగా వచ్చిన ఆయన అభిమానలు, బీజేపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి చెందారు. గుజరాత్‌లోని నవ్‌సరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీఆర్‌ పాటిల్‌.. ప్రస్తుత ఎన్నికల్లో బరిలో నిలిచారు. ముందుగా నామినేషన్ వేసేందుకు విజయ ముహూర్తం చూసుకున్నారు.


దాని ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12.39 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని.. ఆ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే ఘన విజయం సాధిస్తారని పండితులు ఆయనకు చెప్పారు. దీంతో ఆయన ఆ సమయానికి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా నవ్‌సరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు. సీఆర్ పాటిల్‌ నామినేషన్ వేస్తుండటంతో.. గుజరాత్‌లోని బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానాలు భారీగా తరలివచ్చారు. దీంతో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. ముందుగానే బయల్దేరినా.. భారీ ర్యాలీ వేగంగా ముందుకు కదలకపోవడంతో నవ్‌సరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే సరికి ముహూర్త సమయం 12.39 గంటలు దాటి పోయింది.


దీంతో నామినేషన్ వాయిదా వేసుకోవాలని సీఆర్‌ పాటిల్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరో ముహూర్తం చూసుకుని నామినేషన్‌ దాఖలు చేయాలని భావించి.. సీఆర్ పాటిల్ వెనక్కి వెళ్లిపోయారు. ఈ నిర్ణయంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రోజే నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడం గమనార్హం. ఈ 26 స్థానాలకు మూడో దశ పోలింగ్‌లో భాగంగా మే 7 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4 వ తేదీన అన్ని రాష్ట్రాలతోపాటే కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరగనుంది. ఇక గత పదేళ్లుగా గుజరాత్‌లోని 26 స్థానాలు బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం సీట్లు బీజేపీ గెలుచుకోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com