ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం షాపు నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్ఈబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులోకి తీసుకొని ఆరా తీయగా.. మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి.
పెదఉల్లగల్లు, ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వ మద్యం షాపుల నుంచి ఈ కేసులను నిందితులు సేకరించారు. ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి, మద్యం నిల్వ చేసిన మాలకొండారెడ్డి, డ్రైవర్ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల, మూడు షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు షేక్ అంజిబాబు, గండి జక్రయ్య, గోపిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఆరుగురు సేల్స్మన్పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ తెలిపారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్టు చేశామన్నారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.20.63 లక్షలు ఉంటుందని తెలిపారు.