తిరుమల శ్రీవారి ఆలయం ముందు కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు ఓవరాక్షన్ చేశాడు. బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నేత సౌమ్యా రెడ్డి ఫోటోతో శ్రీవారి ఆలయం ముందు హల్చల్ చేశాడు. సౌమ్యా ఫోటోను కాంగ్రెస్ కార్యకర్త బాహాటంగా చూపించాడు. తిరుమలలో పార్టీ, రాజకీయ నేతల ఫోటోలను తీసుకెళ్లరాదనే నియమం ఉంది. అయితే ఆ నియమాన్ని తుంగలో తొక్కిన కర్ణాటక యువకుడు.. ఆలయం ముందు అత్యుత్సాహం ప్రదర్శించాడు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీ రామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.