ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ను హత్య చేసేందుకే దాడి.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రాయి దాడి ఘటన తీవ్ర మాటల యుద్ధానికి దారి తీయగా.. తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఇక ఈ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని చంపేందుకు నిందితులు కుట్ర చేశారని.. అందులో భాగంగానే రాయితో దాడి చేశారని పేర్కొన్నారు. రాయి దాడి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చంపేందుకే నిందితులు రాయి విసిరారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నేరం తీవ్రతను బట్టి దీన్ని హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇక రాయి దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని.. 12 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించినట్లు తెలిపారు. ఈ నెల 17 వ తేదీన తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. విజయవాడలోని సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


అంతేకాకుండా స్థానికుల సమక్షంలో సతీశ్ సెల్‌ఫోన్, బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. ఏ1 వేముల సతీష్ కుమార్‌.. ఏ2 వేముల దుర్గారావు ప్రేరేపించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పదునైన కాంక్రీట్ రాయిని నిందితుడు వేముల సతీష్ విసిరినట్లు వెల్లడించారు. బస్సుయాత్రలో భాగంగా జనం మధ్యలోనే ఉండి నిందితుడు వేముల సతీష్ రాయిని విసిరి ఆ తర్వాత అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడని వివరించారు. కుట్రలో భాగంగా ముందస్తు ఒప్పందం ప్రకారం గురి పెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరినట్లు చెప్పారు.


అయితే ఆ రాయి బలంగా తాకకపోవడంతో సీఎంకు చిన్న గాయంతో బయట పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ1గా సతీశ్, ఏ2గా దుర్గారావు పేర్లను చేర్చినట్లు కోర్టుకు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసులో తదుపరి ఆధారాలు, వివరాలు పోలీసులు సేకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com