భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ హరికుమార్ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మూడు రోజుల వీడ్కోలు పర్యటనకు విశాఖపట్నం వచ్చారు. తూర్పు నౌకాదళంలో అన్ని యూనిట్లను సందర్శించి, సమీక్షించారు. యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను సందర్శించి అక్కడే అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సముద్రిక ఆడిటోరియంలో అధికారులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. డిఫెన్స్ సెక్యూరిటీ దళానికి నౌశక్తి నగర్లో ప్రత్యేకంగా నిర్మించిన 492 గదుల నిర్మాణం ‘వీరం’ను ప్రారంభించారు. అరేబియా మధ్యధరా సముద్రంలో సముద్రపు దొంగల దాడులను తిప్పికొట్టడంలో చురుకైన పాత్ర పోషించిన ఐఎన్ఎస్ సుమిత్రకు ప్రత్యేక పురస్కారం అందించారు.